టార్గెట్ 2019: నెల రోజుల పాటు బాబు ప్రచారం
ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు కూడ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బాబు సూచించారు.
అమరావతి: ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు కూడ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బాబు సూచించారు. ఫిబ్రవరి చివరి నాటికి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు టీడీపీ చీఫ్ స్పష్టం చేశారు.రోడ్షోలు నిర్వహించాలా, ప్రతి రోజూ రెండు జిల్లాల్లో సభలు నిర్వహించాలా అనే విషయమై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు.నెల రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్విరామంగా చేపట్టేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారు.
గురువారం నాడు మధ్యాహ్నం అసెంబ్లీ వాయిదా పడిన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు చర్చించారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలను టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సూచించారు. 30 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
అయితే ప్రతి రోజూ రెండు జిల్లాల్లో ప్రచారం నిర్వహించాలా... లేదా రోడ్షోలు నిర్వహించాలా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై చంద్రబాబునాయుడు పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకొన్నారు.
కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 11 వ తేదీన ఢిల్లీలో ఒక్క రోజు పాటు దీక్ష నిర్వహిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ దీక్షకు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నేతలంతా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. మరో వైపు రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నట్టు చంద్రబాబునాయుడు ఈ సమావేశంలోనే ప్రకటించారు.