ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి  గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకుని నివాళులర్పించిన చంద్రబాబు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉంచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. పార్టీలకు అతీతంగా గౌతమ్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

గౌతమ్‌ రెడ్డి భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించిన చంద్రబాబు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు వెంట సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా గౌతమ్‌ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.

గౌతమ్‌ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం బాధ కలిగించింది. రాత్రి వరకు యాక్టివ్‌గా ఉన్న గౌతమ్ రెడ్డి ఉదయం జిమ్‌కు వెళ్లేటప్పుడు ఇబ్బందికి గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లేలోపు పల్స్ పడిపోయిందని వైద్యులు తెలిపారు. వివాదాల జోలికి పోకుండా గౌతమ్ రెడ్డి హుందాగా పనిచేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు. 

గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఈ వార్త తనను షాక్ గురిచేసిందని తెలిపారు. గౌతమ్ రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. తనకు కూడా వ్యక్తిగత నష్టం అని తెలిపారు. తమ కుటుంబాల మంచి సంబంధాలు ఉన్నాయని.. గౌతమ్ చాలా మంచి మనిషి అని అనుబంధాన్ని గుర్తు చేసుకన్నారు. 

కొద్దిసేపటి కిత్రం గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.