చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిన్నర్ భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శనివారం నాడు రాత్రి భేటీ కానున్నారు. సీట్ల సర్ధుబాటు విషయమై వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది.
![Chandrababu naidu, pawan kalyan to meet today lns Chandrababu naidu, pawan kalyan to meet today lns](https://static-ai.asianetnews.com/images/01dmt8q5e4y76faym1eam1342n/pawan-jpg_363x203xt.jpg)
అమరావతి:తెలుగు దేశం పార్టీ అధినేత, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు శనివారం నాడు రాత్రి భేటీ కానున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై చర్చించే అవకాశం ఉంది. గతంలో ఒక్కసారి ఈ రెండు పార్టీల నేతలు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు సంక్రాంతికి తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఈ తరుణంలో వీరి భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేయనుంది.
తెలుగు దేశం, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది కూడ సంక్రాంతి తర్వాత స్పష్టత రానుంది. అయితే బీజేపీ ఈ కూటమిలో చేరితే ఆ పార్టీ కోరే సీట్లు ఏమిటనే విషయమై కూడ తేలాల్సి ఉంది. జనసేన, తెలుగు దేశం పార్టీల మధ్య కూడ సీట్ల సర్ధుబాటు ఇంకా ఫైనల్ కాలేదు. ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేనకు తెలుగు దేశం పార్టీ 20 నుండి 25 సీట్లు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 14వ తేదీన బోగీ వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ వేడుకలకు ముందు రోజు రాత్రే వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరేందుకు సానుకూలంగా స్పందించినట్టుగా ఆ పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. ముద్రగడ పద్మనాభం ఎక్కడినుండి పోటీ చేస్తే రాజకీయంగా తమ కూటమికి ప్రయోజనం జరుగుతుందనే విషయాలపై కూడ చర్చించే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.