పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సోమవారం పర్యటించారు. అక్కట ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించారు. అక్కట ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిందని.. అయితే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని విమర్శించారు.

కల్తీ సారాను వైసీపీ నేతలే విక్రయిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మద్యం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కల్తీ సారాతో 26 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కల్తీ సారాతో మరణిస్తే.. ప్రభుత్వం సహజ మరణాలనడం సిగ్గుచేటన్నారు. 26 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ఇస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో మద్యం తయారీ నుంచి విక్రయం వరకు సీఎం జగనే చేస్తున్నారన్నారు. కల్తీ సారా నియంత్రించేవరకూ తన పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే దాకా తెదేపా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.