Jobs in Endowments: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ  దేవాదాయ శాఖ‌లో 137 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అలాగే, 16 ఆలయాల్లో అన్నదానాన కార్య‌క్ర‌మం విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.  

Jobs in Endowments Department: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయ శాఖలో 137 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. వీటిలో డిప్యూటీ కమిషనర్లు, గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, జూనియర్ అసిస్టెంట్లు వంటి కీలక పదవులు ఉన్నాయి. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ  నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.

దేవాదాయ శాఖ‌లో ఏపీ ప్ర‌భుత్వం అమోదం తెలిపిన‌ పోస్టుల వివరాలు

1. డిప్యూటీ కమిషనర్లు 6
2. అసిస్టెంట్ కమిషనర్లు 5
3. గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు 6
4. గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు 104
5. జూనియర్ అసిస్టెంట్లు 16

అలాగే, అర్హత కలిగిన అభ్యర్థులతో దాదాపు 200 వెదిక్‌ సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు.

అన్నదానం పథకాన్ని విస్తరించే దిశగా చ‌ర్య‌లకు సీఎం ఆదేశాలు 

ప్రస్తుతం రాష్ట్రంలోని 23 ప్రధాన దేవాలయాల్లో కేవలం 7 ఆలయాల్లోనే రోజువారీ అన్నదానం జరుగుతోంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కనిపాకం, విజయవాడ దుర్గమ్మ ఆలయం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఆలయాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, మిగిలిన 16 ఆలయాల్లో కూడా అన్నదాన కార్య‌క్ర‌మం విస్తరించాలని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు.

తినుబండారాల నాణ్యత, రుచి, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మిగులు నిధులు ఉన్న ఆలయాల ద్వారా ఈ పథకాన్ని అభివృద్ధి చేయాలన్నారు. తిరుమల వేంగమాంబ అన్నదానం స్థాయిలో నాణ్యత ఉండాలన్నారు.

ఆల‌యాల కోసం మాస్టర్ ప్లాన్‌లు, అభివృద్ధి ప్రణాళికలు

23 ప్రధాన ఆలయాల కోసం మాస్టర్ ప్లాన్‌లు రూపొందించాలన్నారు. అభివృద్ధి పనులు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆలయ భూముల లీజింగ్ విషయంలో ఆదాయాన్ని పెంచే విధంగా కమిటీ రూపొందించాలని సూచించారు. ఈ భూములపై కేవలం శాకాహార హోటళ్లకే అనుమతి ఇవ్వాలన్నారు.

ఆల‌యాల్లో సీసీ టీవీ, భద్రతా ఏర్పాట్లకు ఆదేశాలు

ప్రస్తుతం రూ.50,000 కంటే ఎక్కువ ఆదాయం కలిగిన ఆలయాల్లో మాత్రమే సీసీ టీవీలు ఉన్నాయి. అయితే, త‌క్కువ ఆదాయ వర్గంలో ఉన్న 24,538 ఆలయాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక బాలాజీ ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

శ్రీశైలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

శ్రీశైలం దేశంలో ఒక ప్ర‌త్యేక దేవాల‌యం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం రెండింటిని కలిగి కేంద్రంగా  ఉంది. శ్రీశైలాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వమే అక్కడ వసతి సదుపాయాలు నిర్మించాలని సూచించారు.

పచ్చదన కార్యక్రమాలు, ఆన్‌లైన్ సేవలు 

6A వర్గంలోని ఆలయాల్లో ఇప్పటికే 19,000 మొక్కలు నాటారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి మరిన్ని ఆలయాల్లో ఈ కార్యక్రమం విస్తరించనున్నారు. 175 ఆలయాల్లో దర్శన, సేవల బుకింగ్‌, వసతి, ఈ-హుండీ వంటి ఆన్‌లైన్ సేవలు ప్రారంభించారు. వాట్సాప్‌ ఆధారిత పరిపాలన సేవలు 22 ఆలయాల్లో అమలవుతున్నాయి.

భారీగా ఆలయాల‌ ఆదాయాలు

రాష్ట్రంలోని ఆలయాల వార్షిక ఆదాయం రూ.1,300 కోట్లకు మించి ఉంది. ఇందులో రూ.850 కోట్లు టాప్‌ 7 ఆలయాల నుండి వస్తున్నాయి. రూ.5 లక్షలకుపైగా ఆదాయం కలిగిన ఆలయాలు తమ ఆదాయంలో 9% కామన్ గుడ్ ఫండ్‌ (CGF) కు కేటాయిస్తాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి CGF ద్వారా రూ.149 కోట్లు వచ్చాయి. అందులో రూ.111 కోట్లు 48 అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా ఆలయ పరిపాలన, అభివృద్ధి, భద్రత, భక్తుల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.