సారాంశం
Chandrababu: సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా భువనేశ్వరి ఢిల్లీలో విచ్చేశారు.
Chandrababu: సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్కు టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు. నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు సిద్ధార్థ లూథ్రా కుటుంబ సభ్యులు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు.
తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరు కావడం పట్ల లాయర్ లూథ్రా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీకి భారత ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కర్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతితో చంద్రబాబు ముచ్చటించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది.
అంతకుముందు.. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు సాదరంగా ఆహ్వానించారు.
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన తరువాత ఇదే తొలి పర్యటన. ఇదిలాఉంటే మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నవంబర్ 20న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవంబర్ 21న ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు తమ పరిధి దాటి వ్యవహరించినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.