శ్రీవారి నగల వివాదంపై చంద్రబాబు కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి నగల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు.
అమరావతి: తిరుమల శ్రీవారి నగల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు. ఇక ప్రతి రెండేళ్లకు ఓసారి శ్రీవారి నగలను లెక్కిస్తామని, అందుకు న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశంతోనే ఆ చర్యలు చేపడుతున్నట్లు ఆయన సోమవారం తెలిపారు. టీటీడీలో రాజకీయాలకు తావు ఇవ్వకూడదనేది తమ చర్యల ఉద్దేశమని ఆయన చెప్పారు.
ఆగమ శాస్త్రం ప్రకారమే కొండపై అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు చివరకు దేవుడిని కూడా వదలడం లేదని ఆయన అన్నారు. లేని నగల గురించి, వజ్రాల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు అన్నారు.
రమణదీక్షితులు తాను చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సవాల్ చేశారు.