పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే చిత్రహింసలు పెడతారా? మరి పత్రికలో పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి ఫేక్ వార్తాకథనాలు రాసినవారిని అరెస్ట్ చేయరా? అంటూ చంద్రబాబు నాయుడు పోలీసుల మీద విరుచుకుపడ్డారు.
అమరావతి : సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి పోలీసులు ధరణికోటకు చెందిన వెంకటేష్ ను అరెస్టు చేశారు. మరి వైయస్ వివేకానంద రెడ్డిని వాళ్లే చంపేసి, తెల్లవారి సాక్షి దినపత్రికలో ఆ హాత్యను నాకు ఆపాదిస్తూ ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ పెద్దగా హెడ్డింగ్స్ పెట్టి ఆర్టికల్ వేసిన వాళ్ళను ఏం చేయాలి? ఆ వార్త వేసినందుకు ‘సాక్షి’ ఎండీ వైఎస్ భారతి రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ది గ్రేట్ డీజీపీని, ది గ్రేట్ ఏపీ సిఐడి చీఫ్ ను అడుగుతున్నాను. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో మీకు తెలియదా? నా మీద రాసిన వార్తలు అసత్యాలని, ఫేక్ అని మీకు తెలియదా? ఇప్పుడు వెంకటేష్ చేసిన పని.. సాక్షి పత్రిక చేసిన పని కంటే ఘోరమైనదా? అని ప్రశ్నించారు.
‘అయినా ఆ పోస్ట్ ను ఫార్వర్డ్ చేసింది వెంకటేష్.. దీంతో సాంబశివరావు ఏం సంబంధం ఉంది? అతడిని ఎందుకు చిత్రహింసలు పెట్టారు?’ అని పోలీసుల మీద టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి సంబంధించిన పేపర్ ని చూపిస్తూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కొందరు కళంకితులైన, Psycho ప్రవర్తన కలిగిన పోలీసు అధికారులతో.. రాజకీయ ప్రత్యర్థులను కొట్టి స్తోందని, ప్రశ్నించిన వారిమీద దాడులు చేయిస్తోందని.. అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.
వైయస్ జగన్ ప్రవర్తన నచ్చక వైసిపి గౌరవాధ్యక్షురాలు పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన పోస్ట్ ను ఫార్వర్డ్ చేశారని ధరణికోటకు చెందిన వెంకటేష్ ని, మంగళగిరికి చెందిన సాంబశివరావును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వారిని చిత్రహింసలు పెట్టారు. దీన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. సిఐడి పోలీసులు తనని ఎలా చిత్రహింసలకు గురి చేసింది సాంబశివరావుతో చెప్పించారు.
తప్పు చేసిన ఏ పోలీసును వదిలిపెట్టం…
పోలీసులకు ఇదే నా హెచ్చరిక. ఖబర్దార్.. అంటూ చంద్రబాబు నాయుడు పోలీసుల మీద విరుచుకుపడ్డారు. ‘కొందరు పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేయాలనుకుంటున్నారు.. మీ ఇష్టం చేసుకోండి.. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం అంటే చూస్తూ ఊరుకోం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. వారిని చట్టం ముందు దోషిగా నిలబెడతాం. ఎన్ని వేల మందిని పోలీసు కస్టడీలో పెడతారో, కొడతారో మేమూ చూస్తాం. మా పోరాటం పోలీసుల మీద కాదు.... మాది రాజకీయ పోరాటం. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో విభేదిస్తారు. ఆ క్రమంలో పోలీసులు మాకు అడ్డుతగలడం ఉంటే వాళ్లను చట్టం ముందు నిలబెడతాం. ఈరోజుతో అంతా అయిపోయిందని అనుకోవద్దు. తప్పు చేసిన ఎవ్వరినీ వదలం.. అవసరమైతే నేనే పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితులకు అండగా నిలబడతాను. పోలీసుల అరాచకాలు అన్నీ అక్కడే నిలదీస్తాను. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
