కడప ఉక్కుపై గాలి వ్యాఖ్యలు: కేంద్రంపై చంద్రబాబు అనుమానాలు
కడప ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: కడప ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కడప ఉక్కు కర్మాగారాన్ని తమకు అప్పగిస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ఆయన ఆ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కడప ఉక్కు కర్మాగారంపై ఆయన సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్ కు, గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేసేందుకే కడప ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని ఆయన అన్నారు. జగన్ కడప ఉక్కు కర్మాగారంపై మాట్లాడకపోవడం ఆ అనుమానాలను బలపరుస్తోందని చంద్రబాబు భావిస్తున్నారు.
కడప ఉక్కు కర్మాగారంపై ప్రధాని నరేంద్ర మోడీకి పలుమార్లు లేఖలు రాశామని, టాస్క్ ఫోర్స్ సమావేశంలో అడిగినవాటికి అన్నింటికీ సమాధానాలు ఇచ్చామని ఆయన చెప్పారు. కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ ఎంపి సిఎం రమేష్, ఎమ్మెల్సీ బిటెక్ రవి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
కడప ఉక్కు కర్మాగారం కోసం రేపు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఎల్లుండి బుధవారం కొన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాలని ఆయన సూచించారు. బిజెపి, వైసిపి, జనసేన కుట్ర రాజకీయాలను ఎండగట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన కడప ఉక్కు కర్మాగారంపై ఢిల్లీలో పార్టీ ఎంపీలు ధర్నా చేస్తారని చెప్పారు. కడప ఉక్కు కర్మాగారానికి మెకాన్ కమిటీ సానుకూలంగా స్పందించినా కేంద్రం సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిందని చంద్రబాబు చెప్పారు.