కర్ణాటకలో  బీజేపీ ఆధిక్యం

కర్ణాటకలో కమలం వికసించింది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ.. కర్ణాటకలో విజయం దిశగా దూసుకుపోతోంది.ఈ విషయంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరచర్చ మొదలైంది. అది కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి. కర్ణాటకలోని తెలుగు ప్రజలు.. చంద్రబాబు మాటలను పెడచెవిన పెట్టారా? అనేది ఈ చర్చ సారాంశం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంతకీ విషయం ఏమిటంటే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి తెలుగు రాష్ట్రాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అక్కడి తెలుగు ప్రజలు బీజేపీకి ఓటు వేయకూడదంటూ ప్రచారం చేపట్టాయి. ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపీ కి ఓటు వేయవద్దని.. పరోక్షంగా కాంగ్రెస్ కి వేయాల్సిందిగా హితవు పలికారు. మరోవైపు కేసీఆర్ కూడా జేడీఎస్ కి ఓటు వేయాల్సిందిగా సూచించారు.

అయితే.. అనూహ్యంగా.. బీజేపీనే అధికారం దిశగా దూసుకుపోతోంది. అంటే.. తెలుగు ప్రజలు తెలుగు సీఎంల మాట పెడ చెవిన పెట్టినట్టే కదా అనే భావన వ్యక్తమౌతోంది. ముఖ్యంగా దీని ప్రభావం చంద్రబాబుపైనే ఎక్కువగా కనపడేలా ఉంది. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో .. టీడీపీ, బీజేపీకి చెడిన విషయం తెలిసిందే. దీనిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది.

అంతేకాకుండా.. కర్ణాటకలో బీజేపీకి మద్దతుగా వైసీపీ నేతలు ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు కూడా. అంతెందుకు.. ఏపీ ఎన్జీవో సంఘం అధినేత అశోక్ బాబు.. ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా సభపెడితే..వైసీపీ నేతలు నానా రభస చేశారు. ఏది ఏమైనా పొరుగు రాష్ట్రంలో.. కూడా వైసీపీదే పై చేయిగా నిలిచిందనే వాదనలు వినపడుతున్నాయి. ఈ లెక్కన చంద్రబాబుకి గట్టి షాకే తగిలిందని చెప్పాలి. ఈ ప్రభావం 2019 ఎన్నికలపై కూడా పడే అవకాశం కూడా లేకపోలేదనేది విశ్లేషకుల వాదన.