డాక్టర్ సుధాకర్ ను జగన్ ప్రభుత్వం బలి తీసుకుంది: చంద్రబాబు
నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. డాక్టర్ సుధాకర్ ను వైఎస్ జగన్ ప్రభుత్వం బలి తీసుకుందని ఆయన విమర్శించారు.
అమరావతి: నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యేనని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు సుధాకర్ బలి అయ్యారని ఆయన అన్నారు. మాస్కులు అడిగిన పాపానికి శారీరకంగా, మానసికంగా సుధాకర్ జగన్ ప్రభుత్వం బలి తీసుకుందని ఆయన అన్నారు. మానసికంగా వేధించి డాక్టర్ సుధాకర్ ను చంపారని ఆయన అన్నారు.
Also Read: వివాదాస్పద వైద్యుడు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి
నడిరోడ్డు మీద దుస్తులు తీసి, డాక్టర్ సుధాకర్ ను జగన్ ప్రభుత్వం వేధించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలకు ఒక డాక్టర్ బలయ్యాడని ఆయన అన్నారు. దళిత డాక్టర్ మృతికి కారణమైన జగన్మోనహ్ రెడ్డి ఇంతకింత అనుభవంచే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు.
మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు . సుధాకర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.