24 గంటల్లోపే చంద్రబాబును కోర్టులో హాజరుపరిచాం.. సీఐడీ తరఫున ఏఏజీ వాదనలు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సందర్బంగా సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుంది.

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సందర్బంగా సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుంది. కేసుపై వివరాలను సుధాకర్ రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. 24 గంటలలోపే చంద్రబాబును కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణ సమయాన్ని మినహాయించవచ్చని అన్నారు.
ఈ కేసులో ఏ35, మరో ఏడుగురిని సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని అన్నారు. ఏ35 రిమాండ్ను ఇదే కోర్టు రిజెక్ట్ చేసిందని చెప్పారు. అయితే అపెక్స్ కోర్టు రిమాండ్ విధిస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిందని అన్నారు. 2015లో జీవో 4 ద్వారా ఈ స్కామ్కు తెరదీశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. అయితే ఈ క్రమంలోనే ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధాలు ఉన్నాయా? అని సీఐడీని ఏసీబీ న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
ఇక, అంతకుముందు.. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఓపెన్ కోర్టులో వాదనలు వినేందుకు ఏసీబీ న్యాయమూర్తి అంగీకరించారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు ముగ్గురు న్యాయవాదులు అనుమతి కోరగా.. ఇద్దరికి మాత్రమే న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు.
Also Read: నేను ఏ తప్పు చేయలేదు.. రాజకీయ కక్షతోనే అభియోగాలు: ఏసీబీ కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు
ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుపై 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని సిదార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యాధారాలు చూపించాలని అన్నారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని సిద్దార్థ లూథ్రా నోటీసు ఇచ్చారు. తిరస్కరణలపై వాదనలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తిని కోరారు. అందుకు ఏసీబీ న్యాయమూర్తి అనుమతించారు. చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డు చేశారు.
అందులో తాను ఏ తప్పు చేయలేదని చంద్రబాబు తెలిపారు. తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమని అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు అని అన్నారు. శనివారం ఉదయం 5.40 గంటలకు సీఐడీ తనకు నోటీసులు ఇచ్చిందని.. అయితే ఈరోజు ఉదయం 5.40కు రిమాండ్ రిపోర్టు ఇచ్చారని చెప్పారు.
ఇక, అరెస్ట్ చేసిన 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలనే నిబంధనను పాటించలేదని చెప్పారు. సీఐడీ అధికారుల తీరును న్యాయమూర్తికి వివరించారు. చంద్రబాబు దగ్గరకు వచ్చిన పోలీసులు మొబైల్ లోకేషన్ పరిశీలించాలని కోరారు.