వృద్దురాలికి చంద్రబాబు పాదాభివందనం
అమరావతి నిర్మాణం కోసం రామగిరి మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే వృద్ద మహిళ రూ. 50 వేలు విరాళంగా ఇచ్చింది.
అమరావతి: అమరావతి నిర్మాణం కోసం రామగిరి మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే వృద్ద మహిళ రూ. 50 వేలు విరాళంగా ఇచ్చింది. మంగళవారం నాడు చెర్లోపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాల విడుదల సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబుతో పాటు ఆమె కూడ ఈ సభలో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి విరాళమిచ్చిన ముత్యాలమ్మకు బాబు పాదాభివందనం చేశారు.
సభ ముగిసిన తర్వాత తనకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లో పొదుపు చేసుకొని దాచిన డబ్బును రాజధాని నిర్మాణం కోసం సీఎం చంద్రబాబుకు అందించారు.రాజధాని నిర్మాణంలో తన వంతు వాటాగా రూ.50 వేలు చెల్లించిన ముత్యాలమ్మను చంద్రబాబునాయుడు కొనియాడారు.
రాష్ట్రంలో ఇలాంటి వాళ్లు కూడ ఉండడం అదృష్టమని ఆయన చెప్పారు. ఈ రకమైన స్పూర్తి అందరిలో రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముత్యాలమ్మను అభినందిస్తూ బాబు సభ వేదికపైనే ఆమె పాదాలకు నమస్కరించారు.