అధికార అండతో వైసిపి నాయకులు యదేచ్చగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష టిడిపి ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.
గుంటూరు : గుంటూరు జిల్లాలో అధికార వైసిపి నేతల మట్టి దోపిడీని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పొన్నూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ మైనింగ్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు అనుమర్లపూడికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా భారీగా పోలీసులు మొహరించారు. అలాగే అనుమర్లపూడికి వెళ్లకుండా టిడిపి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.
గుంటూరు టిడిపి అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్, టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అనుమర్లపూడికి వెళ్లడానికి సిద్దమవుతుండగా వీరి ఇళ్లవద్దకు చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు టిడిపి నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. చివరకు చేసేదేమిలేక శ్రవణ్, మ్యానీ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
ఇక ఇప్పటికే అనుమర్లపూడి పోలీసుల వలయంలో వుంది. చుట్టుపక్కలంతా చెక్ పోస్టులను ఏర్పాటుచేసి గ్రామంలోని ఎవ్వరినీ అనుమతించడం లేదు పోలీసులు. అయితే టిడిపి నాయకులు కూడా ఎట్టిపరిస్థితుల్లో ఛలో అనుమర్లపూడిని విజయవంతం చేయాలని పట్టుదలతో వున్నారు.
ఇక టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి అనుమర్లపూడి చెరువువద్ద ఆందోళనకు దిగిన ధూళిపాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆందోళనలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఛలో అనుమర్లపూడి పిలుపు నేపథ్యంలో అప్రమత్తమై ధూళిపాళ్ల ఇంటివద్ద పోలీసులను మొహరించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి, చెక్ పోస్టులను దాటుకుని ఎలాగోలా అనుమర్లపూడి చెరువువద్దకు చేరుకున్ని ధూళిపాళ్ళ ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం అనుమర్లపూడిలో 144సెక్షన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతించడం లేదన్నారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అనుమర్లపూడికి చేరుకుంటున్న టిడిపి నాయకులను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
గత వారం గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కారుపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇలా వైసిపి అండతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా తనపై జరిపిన దాడిని నిరసిస్తూ ధూళిపాళ్ల ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు. ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు.
