విద్యుత్ సంస్కరణలు అమలు చేసి డిస్కంల నష్టాలు తగ్గించి పవర్ సెక్టార్కు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడిన పది రాష్ట్రాలకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 3,716 కోట్ల రుణ అనుమతి ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి డిస్కంల నష్టాలు తగ్గించి, విద్యుత్ రంగం ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీ ప్రోత్సాహకాన్ని వెల్లడించింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన సానుకూల ఫలితాలు రాబట్టిన పది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహిరంగ మార్కెట్ నుంచి రూ. 3,716 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మొత్తం పది రాష్ట్రాలకు ఈ ప్రోత్సాహం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 28,204 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రూ. 3,716 కోట్ల అదనపు రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అత్యధికంగా తమిళనాడుకు రూ. 7,054 కోట్లు, ఆ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్కు రూ. 6,823 కోట్ల, రాజస్తాన్కు రూ. 5,186 కోట్ల రుణ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ రాష్ట్రాల తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు రుణాన్ని ఏపీ సహా పది రాష్ట్రాలు వాడుకున్నాయి. ఏపీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 46,443 కోట్ల బహిరంగ రుణానికి అనుమతి ఇచ్చింది. కాగా, అందులో పెట్టుబడి వ్యయంతో రూ. 5,309 కోట్లను ముడిపెట్టింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకు గాను రూ. 3,716 కోట్లు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. మిగిలిన రూ. 37,418 కోట్లు నేరుగా బహిరంగ మార్కెట్ రుణాలుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది.
