ఏపికి కేంద్రం నుండి మరో రూ.700 కోట్లు: మంత్రి పెద్దిరెడ్డి
ఏపీలోని 13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కేంద్రం విడుదల చేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
అమరావతి: ఏపీలోని 13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కేంద్రం విడుదల చేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గతంలో కేంద్రం 2 వేల కోట్లు విడుదల చేయగా తాజాగా అదనంగా మరో రూ.700 కోట్లు విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు.
కేంద్రం విడుదల చేసిన ఈ నిధులతో ఉపాధి హమీ కార్మికులకు సరయిన సమయంలో వేతనాలు అందుతాయన్నారు. అలాగే అందరికి పని కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే పని చేసుకోవాలని ఉపాధి కార్మికులకు సూచించారు.
ఉపాధి కూలీల వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మార్చిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు మంత్రి పెద్దిరెడ్డి లేఖ రాసారు. దీనికి స్పందనగా ఈ నిధులను విడుదల చేశారని మంత్రి తెలిపారు.
read more ఆ మూడు జిల్లాల్లో అలసత్వం... వారిదే బాధ్యత...: మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక
కరోనా వ్యాధి వ్యాప్తితో లాక్ డౌన్ అమల్లో వున్న నేపథ్యంలో ఆర్థిక బాధలతో సతమతమవుతున్న ఉపాధి హామీ కూలీలకు ఇది ఎంతో ఊరట నిస్తుందని ఆయన తెలిపారు. కరోనా తీవ్రతను అవగాహన పరుస్తూ, భౌతిక దూరం పాటిస్తూ 13 జిల్లాల్లో అడిగిన ప్రతి కూలీకి పని కల్పిస్తున్నామని...ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిస్తున్నామన్నామని పెద్దిరెడ్డి వెల్లడించారు.
కూలీలు నడిచి వెళ్ళే దూరంలోనే సాధ్యమైనంత వరకు పనులు కల్పిస్తూ, వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. కూలీల వేతనం కూడా రూ.211 నుంచి రూ.237 పెరిగిందని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేసవి అలవెన్సు కూలీలకు మరింత భరోసా ఇస్తుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.