మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేశారు. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డికి నోటీసులు అందజేశారు. అవినాష్ రెడ్డి.. మంగళవారం(జనవరి 24) హైదరాబాద్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి.. మంగళవారం విచారణకు హాజరుకాలేనని అధికారులకు సమాచారం అందజేసినట్టుగా తెలుస్తోంది. ముందస్తు నిర్ణయించిన కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉన్నందువల్ల.. తాను హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. సీబీఐ అధికారుల ముందు హాజరుకావాడానికి సమయం కోరిన అవినాష్ రెడ్డి.. ఐదు రోజుల తర్వాత అధికారులు పిలిచిన సమయంలో విచారణకు హాజరుకానున్నట్టుగా చెప్పినట్టుగా సమాచారం. అయితే అవినాష్ రెడ్డి పంపిన సమాచారంపై సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది.
Also Read: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రేపు విచారణకు రావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
ఇదిలా ఉంటే.. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐ ఈ కేసు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారి పలు విషయాలను వెల్లడించినట్టుగా సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది.
ఇక, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వివేకా హత్య కేసు విచారణ, హత్య వెనుక విస్తృత కుట్ర కోణంకు సంబంధించిన దర్యాప్తును గతేడాది నవంబర్లో హైదరాబాద్కు బదిలీ చేసింది.
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు సోమవారం పులివెందులకు చేరుకున్నారు. పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన గురించి ఆరా తీశారు. భాస్కర్ రెడ్డి అక్కడ లేకపోవడంతో పులివెందులలో వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయన లేరని వైసీపీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలోనే అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కలిసిన సీబీఐ అధికారులు.. అవినాష్ రెడ్డికి జారీచేసిన నోటీసులను ఆయనకు అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
