చంద్రబాబుపై హైకోర్టులో కేసు
ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర్ల సతీష్ హై కోర్టులో కేసు వేశారు. వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలను రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ఫిరాయింపులకు ప్రోత్సహించారని పిటీషనర్ పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటమే కాకుండా నలుగురికి మంత్రి పదవులను ఇవ్వటం నైతికంగా ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నది సతీష్ వాదన. తన పిటీషన్లో చంద్రబాబును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు.
అదే సమయంలో ఫిరాయింపు ఎంఎల్ఏలతో పాటు ఫిరాయింపు మంత్రులను, న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖ కార్యదర్శిని, టిడిపిని ప్రతివాదులుగా పిటీషనర్ చేర్చారు. ఫిరాయింపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినా స్పీకర్ పట్టించుకోలేదని కూడా ఫిర్యాదు చేశారు.
కాబట్టి రాజ్యాంగాన్ని, చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న కారణంగా ప్రతివాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోర్టును కోరారు. ఇప్పటికే ఇదే విషయమై అనేక కేసులు కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. కొన్ని కేసుల్లో అయితే ప్రతివాదులకు కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.