పంచాయతీ కార్యదర్శికి బెదిరింపులు..మాజీ హోంమంత్రి వసంతపై కేసు
మాజీ హోంమంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. వసంత తనకు ఫోన్ చేసి బెదిరించారని కృష్ణాజిల్లా గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నల్లారి వెంకట నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు
మాజీ హోంమంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. వసంత తనకు ఫోన్ చేసి బెదిరించారని కృష్ణాజిల్లా గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నల్లారి వెంకట నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఈ నెల 7న సాయంత్రం విధుల్లో ఉన్న తనకు వసంత నాగేశ్వరరావు ఫోన్ చేశారని... తాను టీడీపీ ప్రభుత్వానికి ఏజెంట్గా పనిచేస్తున్నానంటూ బెదిరించారని ఆరోపించారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని.. వసంత నాగేశ్వరరావు, ఆయన కొడుకు కృష్ణప్రసాద్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనతో పాటు మంత్రి దేవినేని ఉమపైన వసంత నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారని కార్యదర్శి తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వసంత ఫోన్ కాల్కు సంబంధించిన ఆడియో టేపును ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించనున్నారు. ప్రభుత్వోద్యోగి విధులకు ఆటంకం కలిగించారని.. పరుష పదజాలంతో దూషించారన్న ఆరోపణలపై వసంతపై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.