గుత్తి వాగులో కొట్టుకుపోయిన కారు, చిక్కుకుపోయిన బస్సు: ప్రయాణీకులు సురక్షితం
అనంతపురం జిల్లా గుత్తి మండలం గాంధీనగర్ లో గురువారం నాడు ప్రమాదం తప్పిపోయింది. 63 నెంబర్ జాతీయ రహదారిపై వాగులో ఓ కారు కొట్టుకుపోయింది.
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి మండలం గాంధీనగర్ లో గురువారం నాడు ప్రమాదం తప్పిపోయింది. 63 నెంబర్ జాతీయ రహదారిపై వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే కారులోని ప్రయాణీకులను స్థానికులు రక్షించారు. మరో వైపు ఇదే వాగు వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు కూడ చిక్కుకుపోయింది. స్థానికులు ఈ బస్సును సురక్షితంగా బయటకు రప్పించారు.
రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గుత్తి మండలం గాంధీనగర్ వద్ద 63 నెంబర్ జాతీయ రహదారిపై వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
వాగు ఉప్పొంగి రోడ్డుపైకి నీరు ప్రవహిస్తోంది. ఆర్టీసీ బస్సు వెనుకే కారు వెళ్లింది. అయితే కారు ఈ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేకపోయింది. వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. వాగులో కారు కొట్టుకుపోతుండడాన్ని స్థానికులు చూశారు. వాగులోనే కారు కొట్టుకపోయింది. వెంటనే స్థానికులు కారులోని ప్రయాణీకులను రక్షించారు.
మరోవైపు ఇదే వాగులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు కూడ చిక్కుకుపోయింది. బస్సును ట్రక్కు సహాయంతో ఈ బస్సును వాగు నుండి బయటకు లాగారు. బస్సులోని ప్రయాణీకులను కిందకు దించి వాగు దాటించారు.