జగన్ హామీలు చంద్రబాబును మించిపోయాయి
ప్లీనరీ సందర్భంగా జగన్ ఇచ్చిన హామీల అమలుకు వేల కోట్ల రూపాయలు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారో జగన్ చెప్పలేదు. ఇప్పటి ఆర్ధిక పరిస్ధితితో జగన్ హామీలను అమలు చేయటం సాధ్యం కాదు. ఒకరకంగా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలకు మించి ఇపుడు జగన్ హామీలిచ్చారు.
జనాలకు తాయిలాలు పంచిపెడితే గానీ ముఖ్యమంత్రి పదవి అందుకోవటం కష్టమన్న విషయం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా అర్ధమైనట్లే ఉంది. పోయిన ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వబట్టే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. విభజనతో అసలే కుదేలైన రాష్ట్రంలో అన్ని హామీలను అమలు చేయటం కష్టమని అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు హామీలకు ఆకర్షితులైన జనాలు టిడిపి కూటమికి పట్టంగట్టారు.
విభజనతో కుదేలైన రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందన్న విషయం వాస్తవం. ఎందుకంటే, విభజన చట్టం ప్రకారమే ఏపి ప్రభుత్వం లోటు బడ్జెట్ తో మొదలైంది. అటువంటి ప్రభుత్వంలో రుణమాఫీలు, నిరుద్యోగ భృతి, అందరికీ ఉద్యోగాలు, వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి లాంటి అనేక హామీలను అమలు చేసే అవకాశమే లేదు. జనాలకు అవన్నీ అవసరం లేదు కదా? అప్పట్లో ఇదే విషయమై జగన్ మాట్లాడుతూ, లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు హామీలు అమలయ్యే అవకాశాలు లేవని ధ్వజమెత్తారు. జనాలకు చంద్రబాబు తప్పుడు హామీలను ఇచ్చారంటూ ఎన్నో మార్లు మండిపడ్డారు. అటువంటి జగన్ ఇపుడు అదే దారిలో నడుస్తున్నారు.
ప్లీనరీ సందర్భంగా జగన్ ఇచ్చిన హామీల అమలుకు వేల కోట్ల రూపాయలు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారో జగన్ చెప్పలేదు. ఇప్పటి ఆర్ధిక పరిస్ధితితో జగన్ హామీలను అమలు చేయటం సాధ్యం కాదు. ఒకరకంగా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలకు మించి ఇపుడు జగన్ హామీలిచ్చారు.
2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధికపరిస్ధితికి 2019-24 మధ్య ఆర్ధికపరిస్ధితికి పెద్ద తేడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే, అసలే లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వ ఖజానా చంద్రబాబు పుణ్యమా అని మరింత దిగజారిపోయింది. ఆర్ధికంగా అంతటి దయనీయస్ధితిలో ఉన్న ప్రభుత్వం కోలుకునేందుకు కనీసం మరో 20 ఏళ్లు పడుతుందన్నది నిపుణుల అంచనా. అటువంటిది అధికారంలోకి వచ్చేందుకు జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తుండటం నిజంగా దురదృష్టమే.