షాక్: మహిళలు దుస్తులు మార్చుకొనే రూమ్లో సీసీ కెమెరాలు
మరోసారి బయటపడిన దుర్గగుడి అధికారుల నిర్వాకం
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మరోసారి అధికారుల నిర్వాకం వెలుగు చూసింది. సి.వి. రెడ్డి చారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకొనే రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సోమవారం నాడు ఓ పెళ్ళి బృందం గుర్తించి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది.
మహిళలు దుస్తులు మార్చుకొనే రూమ్లో సీసీ కెమెరాలను ఎందుకు ఏర్పాటు చేశారనే విషయమై సెక్యూరిటీ సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్పారని పెళ్ళి బృందం సభ్యులు చెబుతున్నారు.
నాలుగు మాసాలుగా ఈ గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఎవరూ కూడ గుర్తించలేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి కనెక్షన్ ఇవ్వలేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. మరోసారి నాలుగు రోజులుగా ఈ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పారు.
పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పెళ్ళి బృందం సభ్యులు ఆలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొంటారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.