వ్యాపారి ఒంటిపై 49 కత్తిపోట్లు: తానే చంపానని భార్య లొంగుబాటు
చిత్తూరు జిల్లాలో శాంతిపురం మండల కేంద్రంలో జరిగిన ఓ వ్యాపారి హత్య సంచలనం సృష్టిస్తోంది.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శాంతిపురం మండల కేంద్రంలో జరిగిన ఓ వ్యాపారి హత్య సంచలనం సృష్టిస్తోంది. అతని శరీరంపై 49 కత్తిపోట్లు ఉన్నాయి. అతన్ని తానే చంపానంటూ అతని భార్య పోలీసుల ముందు లొంగిపోయింది.
శివాజీ గణేషన్ అనే వ్యాపారి గత ఆరేళ్లుగా కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మాధవి అనే మహిళతో పెళ్లయింది. దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గణేషన్ హత్యకు గురయ్యాడు.
గణేషన్, మాధవి దంపతుల మధ్య ఏ విధమైన విభేదాలు లేవని అంటున్నారు. అయితే మాధవి ఉదయం కుప్పం పొలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. శివాజీ గణేషన్ శరీరంపై 49 కత్తిపోట్లు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే, నిజంగానే భార్యనే అతన్ని హత్య చేసిందా, మరెవరైనా హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు శివాజీ గణేశన్కి తన కుటుంబ సభ్యులతో తగాదాలు ఉన్నాయని, ఆ తగాదాలే హత్యకు కారణమై ఉంటవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో శివాజీ గణేశన్ సోదరుడైన పండరిని అదుపులోకి తీసుకున్నారు. పండరి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు.