జీవిఎల్ తో సమరం: డీజీపికి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
అలాంటి మాటల తూటాలు పేల్చే ఇద్దరి నేతల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసే వరకు వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హద్దుమీరి మాట్లాడుతున్నారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫిర్యాదు చేశారు.
అమరావతి: ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయా..?ఇన్నాళ్లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేతలు ఆకస్మాత్తుగా పోలీస్ స్టేషన్ల మెట్టెక్కడం వెనుక ఉద్దేశం ఏంటి..?
పొలిటికల్ వార్ కాస్త వ్యక్తిగత గొడవలకు దారి తీస్తోందా..?ప్రస్తుతం ఏపీలో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇదే. గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ఉతికి ఆరేస్తున్న నేతల్లో మెుదటి స్థానంలో నిలిచేవారు మాత్రం బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అని చెప్పుకోవాలి.
జీవీఎల్ నే కాదు ఏ నాయకుడు విమర్శలు చేసినా మెుట్టమెుదట టీడీపీలో ఖండించేది మాత్రం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. రోజులో కనీసం ఒక్క ప్రెస్మీట్ పెట్టకపోయినా రోజు గడవదు బుద్దా వెంకన్నకు అంటుంటారు కూడా.
అలాంటి మాటల తూటాలు పేల్చే ఇద్దరి నేతల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసే వరకు వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హద్దుమీరి మాట్లాడుతున్నారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫిర్యాదు చేశారు.
దానికి కౌంటర్గా బుద్దా వెంకన్న కూడా జీవీఎల్ ట్వీట్లపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై డీజీపీ ఠాకూర్ సానుకూలంగా స్పందించారని కేసును విజయవాడ పోలీస్ కమిషనరన్ కి రిఫర్ చేస్తానని చెప్పినట్లు బుద్దా వెంకన్న తెలిపారు.
మరోవైపు జీవీఎల్ ట్వీట్లు బెదిరింపులకు పాల్పడేలా ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. జీవీఎల్కు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించక పోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా చేస్తానని బుద్దా వెంకన్న హెచ్చరించారు.