Asianet News TeluguAsianet News Telugu

టిడిపి-జనసేన పొత్తుపై క్లారిటీ...కేటీఆర్ చెప్పింది నిజమే... బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో అధికార వైసిపి ఓడించేందుకు టిడిపి, జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయంటూ ఇప్పటినుండే జరుగుతున్న ప్రచారంపై బుద్దా వెంకన్న స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

budda venkanna gives clarity On TDP alliance with Janasena
Author
Amaravati, First Published May 4, 2022, 1:44 PM IST

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే 2014 ఎన్నికల్లో మాదిరిగానే పవన్ కల్యాణ్ ను కలుపుని పోయేందుకు సిద్దంగా వుందంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీతో టిడిపి పొత్తు దాదాపు ఖరారయ్యిందని... అధికారిక ప్రకటనే మిగిలిందని రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో టిడిపి నేత బుద్దా వెంకన్నజనసేనతో టిడిపి పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. 

''జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ (pawan kalyan) టిడిపితో కలిసే అవకాశముందేమో అన్న అనుమానంతో వైసిపి నేతలు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు పొత్తుల అంశం టిడిపిలో చర్చకు రాలేదు... జనసేన-టిడిపి పొత్తు అంటూ జరుగుతున్నది ప్రచారం మాత్రమే'' అని బుద్దా వెంకన్న స్పష్టం చేసారు. 

video

ఇక ఏపీలో కరెంట్ కోతలు, రోడ్ల దుస్థితిపై ఇటీవల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అధికార వైసిపి నాయకులు, ప్రభుత్వ పెద్దలు కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబడితే ప్రతిపక్షాలు మాత్రం ఏపీలో దారుణ పరిస్థితుల గురించి ఆయన చెప్పింది నిజమేనని అంటున్నాయి. తాజాగా  బుద్దా వెంకన్న (budda venkanna) కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితులే ఏపీలో వున్నాయని అన్నారు. 

''ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు నిజమే. ఆంధ్రాలో దారుణమైన పరిస్థితులు చూడడానికి ఇక్కడికి రావాలని ఏపీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానిస్తున్నాం. మేమే విమాన టికెట్లు కొని ఇస్తాం... దయచేసి రావాలని ఆయా రాష్ట్రాల సీఎంలకు మా వినతి'' అని వెంకన్న అన్నారు. 

''ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jaganmohan reddy), వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో  తిరుగుబాటు మొదలైంది. ఈ అరాచక, అవినీతి పాలనలో రాష్ట్రం దివాళా తీసింది... కానీ సీఎం జగన్ దగ్గర మాత్రం డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. అన్ని ధరలను పెంచి ప్రజలను జగన్ బాదుతున్నాడు. బీహార్ ని ఏపీ మించిపోయింది... ఈ ఘనత జగన్ దే'' అని బుద్దా ఎద్దేవా చేసారు. 

''ఉత్తరాంధ్రకి విజయ సాయి రెడ్డి అనే ఒక క్రిమినల్ ని ఇంఛార్జ్ గా వేశారు. సీఎం జగన్ ని విజయసాయి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు... కాబట్టే ఆయనకు పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారు. విశాఖను పరిపాలన రాజధాని అన్నారు... అలాంటిది అధికారంలోకి వచ్చిననాటి నుండి ఇప్పటివరకు ఇక్కడ ఒక్క ఇటుక వేయలేదు. పైగా విశాఖను ధ్వంసం చేశారు'' అని ఆరోపించారు. 

''ప్రతి చోటా ఆన్ లైన్ పేమెంట్ అవకాశం కల్పించి కేవలం మద్యం షాపులు దగ్గర మాత్రం ఈ అవకాశం లేకుండా చేస్తున్నారు. తాడేపల్లికి ముడుపుల కోసమే వైన్ షాప్ ల వద్ద డిజిటల్ పేమెంట్స్ అనుమతించడంలేదని స్పష్టమవుతుంది. ఎక్కడలేని పన్నులు వేస్తున్న జగన్ ఏపీకి ముఖ్యమంత్రా? లేక రాక్షసుడా? అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలపై చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్ తప్పితే ఈ భారతదేశంలోనే ఎవరూ లేరు. ప్రజలకు ఇచ్చిన హామీలునెరవేర్చనందుకు జగన్ పై సుమోటోగా కేసులు పెట్టాలి'' అన్నారు వెంకన్న. 

''ప్రస్తుతం జగన్  పోవాలి... చంద్రబాబు రావాలి అని ప్రజలకు కోరుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలే కాదు స్వయంగా జగన్ నియోజకవర్గాల్లోకి సెక్యూరిటీ లేకుండా వెళ్లితే ప్రజల ఆగ్రహం ఏమిటో తెలుస్తుంది. ఇది చాలు ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్దంగా వున్నారని తెలుసుకోడానికి'' అని బుద్దా పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios