లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. లోన్ యాప్ ఉచ్చులో చిక్కుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. లోన్ యాప్ ఉచ్చులో చిక్కుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాుల.. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని భాస్కరనగర్లో నివాసం ఉంటున్న హరికృష్ణ బీటెక్ చదువుతున్నాడు. అయితే అవసరం నిమిత్తం హరికృష్ణ ఈ ఏడాది జనవరిలో పెపీ అనే లోన్యాప్ ద్వారా కొంత రుణం తీసుకున్నాడు. టైమ్కు డబ్బులు చెల్లించినా కూడా ఇంకా నగదు చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకొచ్చారు. లేకుంటే.. నగ్నఫొటోలు బంధువులు, స్నేహితులకు పంపుతామని బెదిరించారు.
ఈ క్రమంలోనే పెట్టీ క్యాష్ అనే మరో లోన్యాప్ ద్వారా హరికృష్ణ రుణం తీసుకున్నారు. ముందుగా లోన్ తీసుకున్న పెపీ లోన్యాప్కు చెల్లింపు చేశాడు. అయితే పెట్టీ క్యాష్ నుంచి హరికృష్ణ రూ.5 వేలు మాత్రమే తీసుకోగా.. రూ.21 వేలు వరకు చెల్లించాలంటూ మెసేజ్లు పంపారు. ఇందుకోసం మరిన్ని లోన్ యాప్ల నుంచి డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ మొత్తాలు చెల్లించినప్పటికీ.. నిర్వాహకుల నుంచి వేధింపులు ఆగలేదు. డబ్బు చెల్లించకుంటే కుటుంబ సభ్యులందరికీ, కాంటాక్ట్ నంబర్లకూ న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరింపులకు దిగారు. ఇందుకు సంబంధించి గతంలో కడియం పోలీసులకు కూడా హరికృష్ణ ఫిర్యాదు చేశారు.
అయితే లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపుల ఎక్కువకావడంతో హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతోనే హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
