విశాఖపట్నంలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విశాఖపట్నంలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు.. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి జై ఆంధ్ర కాలనిలో నివాసం ఉంటున్న దినేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. నేడు అతడి వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందుకు వరుడు దినేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉరివేసుకుని బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో దినేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. దినేష్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది ఇలా ఉంటే.. వారం రోజుల క్రితం తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తెల్లవారితే పెళ్ళిపీటలెక్కాల్సిన యువతి ఓ యువకుడి వేధింపులు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికూతురు ఆత్మహత్యతో అప్పటివరకు వివాహ వేడుకలతో సందడిగా వున్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ కు చెందిన పద్మమ్మ, వెంకటప్ప దంపతుల కూతురు భీమేశ్వరి (19). ఆమెకు పెళ్లిచేయాలని నిర్ణయించిన తల్లిదండ్రులు మక్తల్ మండలం దండు ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేసారు. ఇవాళ (మంగళవారం) ఉదయం 10గంటలకు వరుడి ఇంట్లో వివాహం జరగాల్సి వుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

అయితే భీమేశ్వరిని గతకొంత కాలంగా చందాపూర్ కు చెందిన నర్సిములు వేధించేవాడు. అతడి ప్రేమను యువతి నిరాకరించినప్పటికి వెంటపడుతూనే వున్నాడు. ఈ క్రమంలో యువతికి పెళ్లి నిశ్చయమైనప్పటి నుండి అతడు యువతిని బెదిరించసాగాడు. నీ పెళ్లిని చెడగొడతా... నిన్ను ఎత్తుకెళ్లి పెళ్లిచేసుకుంటానంటూ అతడు వేధిస్తుండటంతో యువతి భయపడిపోయింది. దీంతో పెళ్లికి మరికొద్ది గంటల ముందే దారుణ నిర్ణయం తీసుకుంది.

తన బాధను ఎవరూ చెప్పుకోలేక కుమిలిపోయిన భీమేశ్వరి సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు నర్సిములు వేధింపుల భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ రాసి ఉరేసుకుంది. కుటుంబసభ్యులు చూసేసరికే ప్రాణాలు కోల్పోయి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.