చంద్రబాబుది క్రిమినల్ మైండ్ సెట్, అచ్చెన్నాయుడు సిద్ధమా?: బొత్స
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో క్రిమినల్ మైండి సెట్ ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో క్రిమినల్ మెండ్ సెట్ ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబుకు జవసత్వాలు లేవని ఆయన సోమావరం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు
సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. ఎన్నికల బహిష్కరణ అనేది టీడీపీ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టీడీపీ తన ఓటమిని అంగీకరించుకుని ఫలితాలను విశ్లేషించుకోవాలని ఆయన సూచించారు. ఓటమిని అంగీకరించే ధైర్యం టీడీపీకి లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు అనడం సరి కాదని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. ఇద్దరం పోటీ చేసి ఎవరికి ప్రజల మద్దతు ఉందో తేల్చుకుందామని ఆయన అచ్చెన్నాయుడికి సవాల్ విసిరారు. ప్రజల్లో టీడీపీకి మనుగడ లేదని ఆయన అన్నారు.