మంత్రి వర్గ పునర్ వ్యవస్ధీకరణ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ వుంటే మళ్లీ 24 మందిలో వుంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఏ బాధ్యత ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్ధీకరణ (ap cabinet reshuffle) నేపథ్యంలో మంత్రులంతా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, అవంతి శ్రీనివాస్, కన్నబాబులు భేటీ కావడం కలకలం రేపింది. ఈ సమావేశం అనంతరం బొత్స (botsa satyanarayana) మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (ys jagan) నిర్ణయమే ఫైనల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని (ysrcp) అధికారంలోకి తీసుకురావడమే తమ టార్గెట్ అని బొత్స స్పష్టం చేశారు.
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి జగన్కు పూర్తి స్వేచ్ఛ వుందని.. ఎవరినీ కొనసాగించాలన్నది ఆయన ఇష్టమన్నారు. దేవుడి దయ వుంటే మళ్లీ 24 మందిలో వుంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయాన్ని అందరూ ఆనందంగా ఆమోదించారని.. ఆయన ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తామని బొత్స తెలిపారు. మంత్రులందరం సంతోషంగా రాజీనామా చేశామని మంత్రి తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని సత్యనారాయణ వెల్లడించారు.
అంతకుముందు పాత కేబినెట్లోని ఐదారుగురు మంత్రులు కొత్త మంత్రివర్గంలోనూ కొనసాగుతారని మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) చెప్పారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటామని నాని పేర్కొన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తామని సీఎం అన్నారని కొడాలి నాని తెలిపారు. అయితే ఎవరిని కొనసాగిస్తామనే వారి పేర్లను సీఎం చెప్పలేదని నాని స్పష్టం చేశారు. కొత్త కేబినెట్లో నేను వుంటే అవకాశాలు తక్కువని ఆయన పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలతో ఆ ఐదుగురు మంత్రులు ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇకపోతే.. కేబినెట్ సమావేశంలో జగన్ (ys jagan) సరదాగా మాట్లాడారు. వెయ్యి రోజులు తన కేబినెట్లో వున్నారని... ఇక పార్టీ కోసం మీ సేవలు వినియోగించుకుంటానని చెప్పారు. చంద్రబాబును (chandrababu naidu) మరోసారి ఓడించే బాధ్యత మీదేనని సీఎం పేర్కొన్నారు. కేబినెట్ మీటింగ్ ప్రారంభానికి ముందుకు ఖాళీ లెటర్ హెడ్లపై రాజీనామా లేఖలు తయారు చేశారు ప్రోటోకాల్ అధికారులు. చివరిలో రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు మంత్రులు. 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా జగన్ కోరారు.
ముందుగా అనుకున్న విధంగానే ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్కు రాజీనామా లేఖలు సమర్పించారు. అనంతరం మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. తామంతా రాజీనామాలు చేశామని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాజీనామా లేఖలు సీఎం అందజేశామని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్లే రాజీనామా చేసినట్లు వెల్లంపల్లి పేర్కొన్నారు. మాజీలు అయినవారిని పార్టీ కోసం పనిచేయమని జగన్ సూచించినట్లు అవంతి తెలిపారు. మంత్రి వర్గంలో ఎవరుంటారన్నది చెప్పలేదని శ్రీనివాస్ అన్నారు.
