Asianet News TeluguAsianet News Telugu

దుస్సాహసం చేస్తున్నారు... సుప్రీంకోర్టులోనూ మీకు చుక్కెదురే..: సీఎం జగన్ కు ఎంపి జివిఎల్ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయాలన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు సీఎం జగన్  కు ఓ లేఖ రాశారు.  

BJP MP GVL Written Open Letter to CM YS Jagan akp
Author
Amaravati, First Published Jul 12, 2021, 4:27 PM IST

అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మీడియంలోనే బోధన వుండాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసి తెలుగు భాషను మరుగున పడేయాలని వైసిపి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ సీఎం జగన్ కు జివిఎల్ ఓ బహిరంగ లేఖ రాశారు. 

జివిఎల్ సీఎం జగన్ కు రాసిన లేఖ యధావిధిగా:  

న్యూఢిల్లీ.                                                 
జులై 12, 2021,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
 గౌరవ ముఖ్య మంత్రి. ఆంధ్రప్రదేశ్.                                 
                 .         
 మీరు అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలుగు భాష ప్రాముఖ్యతను తగ్గించే విధంగా, కించపరిచే విధంగా మీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొంది. తెలుగు భాష మన సంస్కృతికి, ఉనికికి ఆధారం. తెలుగు భాషను చిన్నచూపు చూడటం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే. అయినా మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుభాష ఔన్నత్యాన్ని తగ్గించే అధికారం మూన్నాళ్ళకు ఎన్నుకోబడే ప్రభుత్వాలకు ఎక్కడిది ముఖ్యమంత్రి గారు?

మన భాషపై మనకే మక్కువ లేకుంటే అంతకన్నా దౌర్భగ్యం ఏమైనా ఉందా? బ్రిటిష్ వారు పరిపాలించినపుడే ఇంత సాహసం చేయలేదే. ఆంగ్లభాషకు ఎవ్వరం వ్యతిరేకం కాదు. కానీ పర భాష మోజులో మన భాషను మరుగున పడేయాలనుకోవటం భావ్యం కాదు. చేయరాని దుస్సాహసం కూడా.

మొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని మీ ప్రభుత్వం తప్పనిసరిచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని మా పార్టీ నాయకులు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తే న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కూడా చుక్కెదురవటం ఖాయం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంటు 1968లో చేసిన అధికారిక భాషా తీర్మానానికి విరుద్ధం. నూతన జాతీయ విద్యా విధానానికి కూడా విరుద్ధమే. ఏ రకంగా వీటన్నింటికీ విరుద్దమో సంబంధిత అంశాలను ఈ లేఖతో జతచేస్తున్నాను.

డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియాన్ని ఎత్తివేయాలన్నది మీ ప్రభుత్వం తీసుకొన్న మరొక నిర్ణయం. తెలుగు మాధ్యమంలో చదువుకొనే వేలాదిమంది విద్యార్థులకు ఇది అశనిపాతంగా మారింది. ఒకవైపు, ఉన్నత విద్యతోపాటు సాంకేతిక విద్యను కూడా భారత భాషల్లో నేర్పాలని కేంద్ర ప్రభుత్వం చక్కటి ప్రయత్నం చేస్తుంటే మీరంతా ఆంగ్లమయం చేయాలనుకోవడం ఆశ్చర్యాన్ని, అనుమానాలను కలగచేస్తోంది. గత వారమే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతభాషల్లో సాంకేతిక విద్య ఉండాలని చెప్పటం, దానికి అనుగుణంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(AICTE)తెలుగుతో సహా ఎనిమిది భారత భాషల్లో వచ్చే విద్యా సంవత్సరానికి బిటెక్ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయటం తెలిసిందే.

జాతీయ విద్యా విధానానికి, ప్రణాళికలకు విరుద్ధంగా పనిచేయటం ఎంతవరకు సబబు ముఖ్య మంత్రి గారు? గత వారం తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తూ మీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తెలుగుభాష ప్రాముఖ్యతను తగ్గించాలనే మీ ఆలోచనలో భాగంగా కన్పిస్తోంది. ప్రాచీన భాష అయిన సంస్కృత భాషాభివృద్ధి చేయాలనుకోవడం మంచి నిర్ణయమే. కానీ దానికి తెలుగు అకాడమీ కార్యకలాపాల్లో తెలుగు భాష ప్రాధాన్యతను తగ్గించవలసిన అవసరం లేదు. సంస్కృతానికి కొత్త అకాడెమీని స్థాపించి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయం కావచ్చు.

జగన్ గారు, మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలుగు భాషను, తెలుగువారి సంస్కృతిని దెబ్బతీసే విధంగా వున్నాయి. ఇది ఉద్దేశపూరితమా కాదా అన్నది పక్కనపెడితే వాటి పర్యవసానం మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర యువతకు, వారి భవిష్యత్తుకు అఘాతం కలిగించేవే. మీ అనాలోచిత నిర్ణయాలను స్వయంగా ఉపసంహరించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే  మీ ప్రభుత్వ నిర్ణయాలను అన్ని విధాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం..

మాలాగ మీరు తెలుగు మాధ్యమంలో చదవలేదు కనుక తెలుగులో ఈ లేఖను చదవటానికి ఇష్ట పడతారో లేదో లేక కష్టపడతారేమోనన్న అనుమానంతో ఈ లేఖ ఆంగ్ల అనువాదాన్ని కూడా జతచేస్తున్నాను.

ఇట్లు.
భవదీయుడు,
జీవీఎల్(గుంటుపల్లి వెంకట లక్ష్మీ నరసింహా రావు)
 

 

Follow Us:
Download App:
  • android
  • ios