రెచ్చగొడుతున్నారు: జగన్, చంద్రబాబుపై జీవీఎల్ గరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్దతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ:ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్దతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంపై మంగళవారంనాడు రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అంశంపై అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ చెప్పారు.
బాధ్యత కలిగిన పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రజలను కొన్నిపార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడిన విషయాలను జీవీఎల్ ప్రస్తావించారు. అంతేకాదు మహానాడులో కూడ ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రత్యేకంగా తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
గత ఏడాది మేలో మాట్లాడిన మాటలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. హోదా ఉన్నా లేకున్నా ప్యాకేజీతో ఏపీకి లాభం కలుగుతోందని బాబు చెప్పిన విషయాలను జీవీఎల్ గుర్తు చేశారు.
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలు వాస్తవం అవునో.. కాదో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం హమీలకు తమ ప్రభుత్వం హమీలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆయన చెప్పారు.
రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ, వైసీపీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. జీవీఎల్ నరసింహరావు ప్రసంగానికి టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్లు అడ్డుతగిలారు.