పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి ఒక్క బిల్లును కూడా కేంద్రం ఆపలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. నష్ట పరిహారం చెల్లించడానికి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మాధవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను కేంద్రం పై నెట్టడం సరికాదన్నారు.
పోలవరం ప్రాజెక్టు (polavaram project) ఏపీకి వెన్నుముక లాంటిదన్నారు బీజేపీ (bjp) ఎమ్మెల్సీ మాధవ్ (madhav). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆలస్యం జరుగుతుందని ఎద్దేవా చేశారు. కొత్త నినాదాలు, కొత్త వివాదాలకు ఇప్పుడు పోలవరం కేంద్రంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. వీటికి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని.. పక్క రాష్ట్రానికి ముంపు గ్రామాల ప్రజలు వెళ్లిపోతాం అంటున్నారని మాధవ్ విమర్శించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోజుకొక ప్రకటన గందరగోళం కలిగిస్తోందని.. ప్రజల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి రివ్యూ చేస్తున్నారని.. ఎక్కడ నిధులు ఆగాయో, కేంద్రం నుంచి ఏ సహకారం రాలేదో చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు. అప్రోచ్ ఛానెల్ పనులు పూర్తి చేయలేదని... వరద ముంపు లేకుండా డైవర్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాధవ్ విమర్శించారు. శాస్త్రీయ ధృక్ఫదంలో కాంటూరు సర్వే చేయలేదని.. అసందర్భ అంచానాల వల్ల నేడు గ్రామాలు మునిగిపోయాయని ఆయన మండిపడ్డారు. నష్ట పరిహారం చెల్లించడానికి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మాధవ్ ఆరోపించారు. మూడేళ్లుగా ఆర్ ఆర్ ప్యాకేజీ పై ఎపి ప్రభుత్వానికి స్పష్టత లేదని.. రీయంబర్స్మెంట్ సిస్టం వచ్చాక నిధులు ఎక్కడైనా అగాయా అని ఆయన ప్రశ్నించారు.
ALso REad:పోలవరం ఆలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణం: ఏపీ మంత్రి అంబటి రాంబాబు
ఒక్క రూపాయి బిల్లు అయినా నిలిపారా అని మాధవ్ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను కేంద్రం పై నెట్టడం సరికాదని.. సరైన సమయంలో వారిని ఖాళీ చేయించాల్సిందని ఆయన హితవు పలికారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తే.. ఇంతమంది ముంపులో ఉండే వారు కాదన్నారు. డయా ఫ్రం వాల్ మళ్లీ నిర్మించాలని... గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తి కాలేదని మాధవ్ విమర్శించారు. పునరావాసం ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారన్న ఆయన ప్రాజెక్టు వద్ద శిలాఫలకాలను పెట్టడంలో ఉన్న శ్రద్ధ పూర్తి చేయడంలో లేదని ఎద్దేవా చేశారు.
ఎక్కువ ముంపు చూపితే ఎక్కువ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తారని చూపించారని... పోలవరం కోసం ఎంత అప్పు చేశారో జగన్ ప్రభుత్వం చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు. అనేక పథకాలకు అప్పులు తెచ్చిన జగన్... పోలవరంకు ఎందుకు ఖర్చు పెట్టలేదని ఆయన నిలదీశారు. కాంట్రాక్టర్ను మార్చడానికి పనులు కూడా ఆపేశారని.. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం పెరగడానికి జగన్ ప్రభుత్వమే కారణమని మాధవ్ ఆరోపించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దానిని పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో తామే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడంతో ఆలస్యం అయిన మాట వాస్తవమని మాధవ్ అంగీకరించారు. సాధ్యమైనంత త్వరలో పోలవరం కేంద్రం పూర్తి చేసి తీరుతుందని ఆయన పేర్కొన్నారు.
