తిరుపతి ఉప ఎన్నిక: జనసేన లేకుంటే కష్టమే.. పవన్ను దువ్వుతున్న బీజేపీ నేతలు
ఏపీ బీజేపీ పవన్ కళ్యాణ్ను మచ్చిక చేసుకుంటుందా..? ఇరు పార్టీల మధ్య వున్న గ్యాప్ తిరుపతి ఉప పోరులో నష్టం చేయకుండా పావులు కదుపుతుందా. అంటే దీనికి అవుననే సమాధానం వస్తోంది
ఏపీ బీజేపీ పవన్ కళ్యాణ్ను మచ్చిక చేసుకుంటుందా..? ఇరు పార్టీల మధ్య వున్న గ్యాప్ తిరుపతి ఉప పోరులో నష్టం చేయకుండా పావులు కదుపుతుందా. అంటే దీనికి అవుననే సమాధానం వస్తోంది.
పవన్ అధినాయకుడు అని నిన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అంటే.. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు 2024 బీజేపీ- జనసేన సీఎం అభ్యర్ధి పవన్ కళ్యాణే అని బహిరంగంగానే ప్రకటించారు.
ఏపీ బీజేపీకి తిరుపతి ఉప ఎన్నికలు పెద్ద పరీక్షగా మారిపోయాయి. 2024లో అధికారం గురించి మాట్లాడుతున్న బీజేపీ.. ఇప్పుడు బైపోల్స్లో గౌరవప్రదమైన ఓట్లు సాధించాల్సి వుంది.
ఒక్క శాతం ఓట్ల పార్టీ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బదులివ్వాల్సి వుంది. అయితే జనసేనను కాదని బరిలో నిలిచిన బీజేపీ ఇప్పుడు అక్కడ సత్తా చాటాల్సి వుంది. కానీ మిత్రపక్షం మద్ధతు లేకుండా అక్కడ అనుకున్న స్థాయిలో ఓట్లు పడవని బీజేపీకి అర్ధమైంది.
దీంతో ఇప్పుడు పవన్పై భారీగానే ఆశలు పెట్టుకన్నారు కమలనాథులు. చివరి నిమిషం వరకు అభ్యర్ధిపై తేల్చని బీజేపీ.. రత్నప్రభను ఫైనల్ చేసింది. అయితే కర్ణాటకలో వున్న రత్నప్రభ తిరుపతిలో అడుగుపెట్టడానికి ముందే హైదరాబాద్ వెళ్లారు.
సోము వీర్రాజుతో కలిసి పవన్ కల్యాణ్ను కలిశారు. ఎన్నికల ప్రచారానికి రావాలని, సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. రత్నప్రభ పవన్ను కలవడం వెనుక కూడా ఇదే కారణంగా తెలుస్తోంది.
తిరుపతిలో జనసేనకు ఇతర ప్రాంతాల కంటే కాస్త బలమైన క్యాడర్ వుంది. అక్కడ పోటీ చేయాలని కూడా స్థానిక నాయకత్వం ఆశించింది. అయితే ఈ సీటుపై గట్టి పట్టుదలతో వున్న బీజేపీనే రంగంలోకి దిగింది.
అయితే అక్కడ పరిస్థితులు గమనించిన కమలనాథులు.. జనసేన మద్ధతు లేకుంటే కష్టమని భావించింది. పవన్ను రత్నప్రభ ముందుగా కలవడంతో పాటు సోము వీర్రాజు, జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే కారణంగా తెలుస్తోంది.