‘‘వైసీపీకి ఓట్లు వేశారని.. కక్ష కట్టారు’’
బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ మీద కక్ష పెట్టుకుందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్ అభిప్రాయపడ్డారు. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించలేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే.. కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారానికి సహకరిస్తే నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన వివరించారు.
కానీ.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం తమకు లభించలేదని ఆయన పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ గురించి ఏనాడూ చంద్రబాబు కేంద్రాన్ని అడగలేదని ఆయన అన్నారు. కావాలనే కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కావాల్సిన భూమి, నీరు కూడా టీడీపీ ప్రభుత్వం కేటాయించలేదన్నారు.
కావాలనే టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రజలపై కక్ష పెంచుకున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీకి కాకుండా వైసీపీకి ఓట్లు వేశారని.. అందుకే వాళ్లపై టీడీపీ కి అంత కక్ష అని విష్ణువర్దన్ అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే బీజేపీకి బలం పెరుగుతందని.. దాని నిర్మాణాన్ని టీడీపీనే అడ్డుకుంటోందన్నారు.