NTR District: ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరింది: దగ్గుపాటి పురందేశ్వరి
NTR District: నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని బుధవారం ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.
NTR District: దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఎన్టీఆర్ కుమార్తె, మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను. ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది. జై ఎన్టీఆర్!" అంటూ ఆమె ట్వీట్ చేసింది.
కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. ప్రతిపక్ష నేతగా జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తాము అధికారంలోకి వస్తే...ఎన్టీఆర్ పేరు పెడతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ఆ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ ...రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ అభిమానులు కృతజ్ఞత, ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడు జగనే అంటూ ..సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. మరోవైపు.. ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకు ఆయన పేరు పెట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నడని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ అంశంపై చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితర రాజకీయ, సినీ వారసులు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.