బీసీని సీఎం చేస్తాం, ఆ సత్తా మీకుందా?: టీడీపీ, వైసీపీకి సోము వీర్రాజు సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీసీని సీఎం చేసే దమ్ముందా అని టీడీపీ, వైసీపీలకు ఆయన సవాల్ విసిరారు.
గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ అభ్యర్ధిని సీఎం చేసే సత్తా టీడీపీ, వైసీపీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలంతా బీజేపీలోనే ఉన్నారని ఆయన చెప్పారు.
అభివృద్ది ద్వారా ఏపీ రూపురేఖలను పూర్తిగా మార్చాలనేది తమ అభిమతమన్నారు. హోంమంత్రి అంటే చంద్రబాబు ఇంటికి కాదని అచ్చెన్నాయుడు తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో బీజేపీలోకి వలసల జోరు కొనసాగనుందన్నారు. మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ, వైసీపీకి చెందిన నేతలు త్వరలోనే బీజేపీలో చేరుతారని ఆయన చెప్పారు. ఈ మేరకు తమ పార్టీతో వారంతా చర్చిస్తున్నారని ఆయన వివరించారు.
రాష్ట్రంలో బలోపేతం కావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. జనసేనతో ఆ పార్టీలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నకల వరకు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఆ రెండు పార్టీలు ప్రకటించాయి. త్వరలోనే వారి పేర్లను వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. బీసీలను ఆకర్షించేందుకు బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.