జగన్ అక్రమాస్తుల కేసు.. హెటిరోకి ఊరట..!
అక్రమాస్తుల కేసుల్లో ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో సంస్థకు భారీ ఊరట లభించింది. హెటిరో సంస్థకు చెందిన విశాఖపట్నం, నక్కపల్లిలోని 43 ఎకరాలను ఈడీ జప్తు చేసింది. కాగా... ఈ భూములను తిరిగి అప్పగించాలని ఈడీకీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ అప్పీలేట్ ట్రెబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.5.6కోట్లు డిపాజిట్ చేసిన జప్తు చేసిన భూములను ఆ సంస్థకు తిరిగి అప్పగించాలని తెలిపింది.
అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలపై ఈడీ హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ అప్పీలు పిటిషన్ను శుక్రవారం హైకోర్టు సీజే హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. స్టేటస్ కో ఆదేశాలు కొనసాగించాలని ఈడీ తరఫు న్యాయవాది అంజలీ అగర్వాల్ కోరగా.. ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం డబ్బు డిపాజిట్ చేసినందున ఇంకా భూములు అప్పగించకపోవడం సరికాదని, ఆ భూములు అప్పగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
అక్రమాస్తుల కేసుల్లో ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ల విచారణను సెప్టెంబరు 30కి వాయిదా వేసింది. కాగా, సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులను దేనికదే విచారణ చేయవచ్చని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డి మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఆన్లైన్ స్కానింగ్ ప్రతులతోపాటు డాక్యుమెంట్లు కూడా ఇవ్వాలని హైకోర్టు పిటిషనర్లకు సూచించింది.
తదుపరి విచారణను జూలై 23కి వాయిదా వేసింది. మరోవైపు ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఆదేశాలను మరో రెండు వారాలు పొడిగించింది.