కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడిన ఎనిమిది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు ఊరట కలిగించింది. ఐఏఎస్‌ల‌కు గతంలో విధించిన సామాజిక సేవా శిక్ష‌ను 8 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీలో కోర్టు ధిక్క‌ర‌ణ‌కు (contempt of court) పాల్ప‌డి జైలు శిక్ష , జ‌రిమానాకు గురై... క్ష‌మాప‌ణ‌లు చెప్పి, జైలు శిక్ష‌ను సామాజిక సేవా శిక్ష‌గా మార్పించుకున్న 8 మంది ఐఏఎస్ అధికా‌రుల‌కు (ias officials) ఊర‌ట లభించింది. ఐఏఎస్‌ల‌కు విధించిన సామాజిక సేవా శిక్ష‌ను 8 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు (ap high court) డివిజ‌న్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. 

పాఠ‌శాల‌ల ఆవ‌ర‌ణ‌లో సచివాల‌యాల నిర్మాణం వ‌ద్దంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను ఏపీ అధికారులు పట్టించుకోలేదు. దీనిపై ప‌లుమార్లు విచార‌ణ సాగింది. అయినా అధికారుల తీరులో మార్పు రాక‌పోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని కోర్టు ధిక్క‌ర‌ణ‌గా ప‌రిగ‌ణిస్తూ 8 మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు జైలు శిక్ష‌, జ‌రిమానా విదిస్తూ హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఇటీవ‌ల సంచ‌ల‌న తీర్పు వెలువరించిన సంగ‌తి తెలిసిందే. అయితే న్యాయ‌మూర్తి శిక్ష‌ను ఖరారు చేస్తున్న స‌మ‌యంలో కోర్టులోనే ఉన్న 8 మంది ఐఏఎస్‌లు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణలు చెప్ప‌ారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు జైలు శిక్ష‌ను కాస్తా... ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల్లో నెల‌కు ఒక రోజు సేవ చేసేలా సామాజిక సేవా శిక్ష‌గా మార్చింది.

ఈ తీర్పుపై ఇప్ప‌టికే ఇద్ద‌రు ఐఏఎస్‌లు హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించ‌గా.. వారి శిక్ష‌ను వాయిదా వేస్తూ డివిజ‌న్ బెంచ్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మిగిలిన ఆరుగురు ఐఏఎస్‌లు కూడా హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన డివిజ‌న్ బెంచ్‌.. వీరికి కూడా ఊర‌ట క‌ల్పించింది. ఈ మేరకు సామాజిక సేవా శిక్ష‌ను 8 వారాల పాటు వాయిదా వేస్తూ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.