నా భర్తాతమ్ముళ్లపై తప్పుడు కేసులు, కేసీఆర్ కు లేఖ రాస్తా: భూమా అఖిలప్రియ
తన భర్త భార్గవ్ మీద, తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆరోపించారు. ల్యాబ్ వారు తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
కర్నూలు: తన భర్త భార్గవ్ మీద, తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరి కాదని ఆమె అన్నారు. గురువారంనాడు ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
కొద్ది రోజుల కింద తన భర్త, తమ్ముడు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చి, తర్వాత కరోనా పరీక్షలు చేయించుకున్నారని ఆమె గుర్తు చేశారు. కొన్ని గంటలకే పోలీసులు వచ్చి స్టేషన్ కు రావాలని చెప్పారని ఆమె అన్నారు ల్యాబ్ నిర్వాహకులు తన భర్తకు పాజిటివ్ ఉందని నివేదిక ఇచ్చారని, పోలీసులకు మాత్రం నెగెటివ్ ఉందని ఇచ్చారని ఆమె చెప్పారు.
తప్పుడు సర్టిఫికెట్ తో తమను మోసం చేశాడని తన భర్తపై పోలీసులు కేసు పెట్టారని భూమా అఖిలప్రియ అన్నారు. ల్యాబ్ వారిపై తాము కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. కిడ్నాప్ ఘటనలో తన భర్త ఉంటే మళ్లీ ఐడెంటిఫికెషన్ ఎందురు రమ్మంటున్నారని ఆమె అడిగారు.
పోలీసులు తమను హింసించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు లేఖ రాస్తానని ఆమె చెప్పారు. ప్రాణం పోయినా ఆస్తులను వదులుకునేది లేదని, తమపై పెట్టిన కేసులను సీబిఐకి అప్పగించాలని ఆమె అన్నారు.