భీమవరంలో కిడ్నాప్.. తాడేపల్లిలో ప్రత్యక్షం, తప్పించుకుని పోలీసుల వద్దకు బాలుడు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అదృశ్యమైన బాలుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో ప్రత్యక్షమయ్యాడు. దుండగులు కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకొచ్చారని.. తాను తప్పించుకుని వచ్చానని బాలుడు పోలీసులకు తెలిపాడు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు బాలుడిని అపహరించి కారులో తీసుకెళ్లారు. అయితే ఆగంతకుల చెర నుంచి తప్పించుకున్న బాలుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో ప్రత్యక్షమయ్యాడు. దుండగులు కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకొచ్చారని.. తాను తప్పించుకుని వచ్చినట్లు బాలుడు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు వెంటనే అతని తండ్రి కమతం రవికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఉదయం లేచి చూసేసరికి తన కొడుకు ఇంట్లో కనిపించలేదని బాలుడి తండ్రి పోలీసులకు తెలిపారు. భీమవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా తాడేపల్లి పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని ఆయన వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.