విశాఖ క్రేన్ ప్రమాదంలో వ్యక్తి.. రోడ్డు ప్రమాదంలో బంధువులు!
నిన్న విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు క్రేన్ ప్రమాదంలో భాస్కరరావు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే భాస్కరావు బంధువులు ఖరగ్ పూర్ నుంచి స్కార్పియోలో విశాఖకు బయల్దేరారు.
విశాఖ క్రేన్ ప్రమాదంలో ఇటీవల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. అతని బంధువులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రెండు ఘటనలతో వారింట్లో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా లోని కంచిలి మండలం జలంత్రకోట వద్ద జాతీయరహదారిపై స్కార్పియో ప్రమాదంలో చనిపోయిన వారంతా భాస్కరావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. నిన్న విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు క్రేన్ ప్రమాదంలో భాస్కరరావు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే భాస్కరావు బంధువులు ఖరగ్ పూర్ నుంచి స్కార్పియోలో విశాఖకు బయల్దేరారు.
కాగా తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కరరావు అత్త నాగమణి, నాగమణి కోడలు లావణ్య, స్కార్పియో డ్రైవర్ రౌతు ద్వారక మృతి చెందగా...భాస్కరరావు బావమరుదులు రాజశేఖర్, ఢిల్లీశ్వరరావు, నాగమణి పెద్ద కోడలు మైథలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.