మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి చేసిన ఆరోపణలపై భరత్ యాదవ్ స్పందించారు. డబ్బుల కోసమే దస్తగిరి ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దస్తగిరి ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

కడప: డబ్బు కోసమే వైఎస్ వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి ఇలా చేస్తున్నారని భరత్ యాదవ్ చెప్పారు. మాజీ మంత్రి YS Vivekananda Reddy Murder కేసు విషయంలో తనపై Dastagiri చేసిన ఆరోపణలపై Bharat Yadav  బుధవారం నాడు  స్పందించారు. 

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.  స్వంత ప్రయోజనాల కోసమే దస్తగిరి మాట్లాడుతున్నారని చెప్పారు. దస్తగిరి డబ్బు మనిషి అని సీబీఐకి చెప్పానన్నారు. దస్తగిరితో తాను ఏ ఒప్పందం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.చెప్పినట్టు వినకుంటే తనను కూడా కేసులో ఇరికిస్తామని CBI చెప్పిందని భరత్ యాదవ్ ఆరోపించారు. తనను కూడా  సహకరించమని సీబీఐ అడిగిందని ఆయన చెప్పారు.

 డబ్బు ఎవరిస్తే వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారని దస్తగిరిపై ఆయన మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్యతో YS కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని దస్తగిరి తనతో చెప్పారన్నారు.  ఈ విషయమై దస్తగిరి మాట్లాడిన వాయిస్ రికార్డు తన  వద్ద ఉందని భరత్ యాదవ్ చెప్పారు.

అఫ్రూవర్ గా మారిన దస్తగిరిని సోమవారం నాడు కోర్టులో  సీబీఐ అధికారులు హాజరు పర్చారు. అయితే ఈ సమయంలోనే మరోసారి సీబీఐకి దస్తగిరి రాత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడు.  అఫ్రూవర్ గా మారిన తనను భరత్ యాదవ్ కలిశాడని ఫోన్‌లో హెలిప్యాడ్ దగ్గరకు రమ్మన్నాడని పేర్కొన్నాడు. 

భరత్ తో  పాటు దేవిరెడ్డి లాయర్ ఓబుల్ రెడ్డి కూడా వచ్చాడని తెలిపాడు. తనకు భూమితో ఎంత డబ్బు కావాలో చెప్పాలని తనను అడిగారని వ్రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు దస్తగిరి.  అప్రూవర్​గా మారిన అతని చేత.. మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు. గతేడాది నవంబర్ 26న దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు కడప కోర్టు అనుమతిచ్చింది. గతేడాది ఆగస్ట్ 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు  ఇటీవల సమర్థించింది. అప్రూవర్ గా మారుతున్నట్టు దస్తగిరి ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు వేసిన పిటిషన్ లను హైకోర్టు కొట్టివేసింది.  దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఖరారు చేసింది. చట్టప్రకారం సీబీఐ ముందుకెళ్లొచ్చని తెలిపింది. 

వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను గతేడాది దస్తగిరి సిబిఐ అధికారులకు  ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని Umashankar Reddy   తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమంది శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, Sunil Yadav, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి ఆ స్టేట్‌మెంట్ లో పేర్కొన్నారు.