ప్రకాశం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం, ఒకరి మీద దాడి.. భయాందోళనలో ప్రజలు..
ప్రకాశం జిల్లాలో ఎలుగుబంటి ఒకరిమీద దాడి చేసింది. శ్రీకాకుళంలో ఎలుగుబంటి దాడి ఘటన మరువకముందే ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకోవడంతో భయాందోళనల్లో ప్రజలు ఉన్నారు.
ప్రకాశం : andhrapradeshలో ఎలుగు బంట్లు సంచారం కలకలం రేపుతోంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎలుగుబంట్లు కలకలం రేపిన ఘటనలు మరవకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో Bears సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడి మెట్ల గ్రామంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఎలుగుబంటిని అడవుల్లోకి తరిమేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో ఎలుగుబంటి ఒకరిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.ఎలుగుబంటి సమాచారం గురించి గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు, ఇతర సామాగ్రితో గ్రామానికి చేరుకున్నారు. పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలకు ఎలుగుబంట్ల భయం పట్టుకుంది. ఎలుగుబంట్లు సంచారంతో కంటిమీద కునుకు లేకుండా పోతుందని కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు వాసులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా జంట ఎలుగుబంట్ల సంచారంతో ఇక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరికి వేయడం వల్ల అవి జనావాసంలోకి వస్తున్నాయి. ఎలుగుబంట్లు సంచారంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అటవీశాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని ఎలుగుబంట్లు తరచూ తమ స్థావరాలను మార్చుకుంటాయని అంటున్నారు. అయితే ప్రజలకు తాము రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
శ్రీకాకుళంలో ఎలుగుబంటి ఆపరేషన్ సక్సెస్: భల్లూకాన్ని బంధించిన అధికారులు
ఇదిలా ఉండగా, జూన్ 21న శ్రీకాకుళం జిల్లా జనంపై దాడి చేసిన ఎలుగుబంటి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఎలుగు బంటిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అటవీ జంతువులపై స్థానికులకు అవగాహన కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దానిని బంధించి విశాఖకు తరలిస్తుండగా ఎలుగుబంటి మృతి చెందింది. తీవ్ర గాయాలతోనే ఎలుగు చనిపోయినట్లు సమాచారం. మరోవైపు ఎలుగుబంటి మృతదేహానికి వైద్యులు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు.
అంతకుముందు కిడిసింగి గ్రామానికి చెందిన కలమట కోదండరావును ఆదివారం జీడితోటల వైపు వెల్తుండగా ఎలుగు బంటి దాడి చేసి చంపింది. ఆ తరువాత సోమవారం తెల్లవారుజామున రెండు ఆవులను తొక్కి చంపేసింది. గత సోమవారం నాడు జీడీ తోటలో పనిచేస్తున్న తామాడ షణ్ముఖరావు మీద ఎలుగుబంటి దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు యువకులు అప్పలస్వామి, చలపతిరావు, సంతోష్ షణ్ముఖరావును కాపాడే ప్రయత్నం చేశారు.
దీంతో వీరి మీద కూడా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ క్రమంలో మాజీ సైనికుడు పోతనపల్లి తులసీరావు, ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న అతని సోదరుడు పురుషోత్తంలు ఎలుగు బంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న జనం అక్కడికి చేరుకోవడంతో ఎలుగు బంటి తప్పించుకొని పోయింది.