శ్రీకాకుళం: జనంపై దాడి చేసిన ఎలుగుబంటి మృతి
శ్రీకాకుళం జిల్లాలో జనంపై దాడి చేసిన ఎలుగు బంటి చనిపోయింది. విశాఖ జూకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే భల్లూకం కన్నుమూసింది. తీవ్రగాయాలతోనే అది చనిపోయినట్లుగా తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా (srikakulam district) జనంపై దాడి చేసిన ఎలుగు బంటిని (bear) పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అటవీ జంతువులపై స్థానికులకు అవగాహన కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఎలుగుబంటి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దానిని బంధించి విశాఖకు (visakhapatnam) తరలిస్తుండగా ఎలుగుబంటి మృతి చెందింది. తీవ్ర గాయాలతోనే ఎలుగు చనిపోయినట్లుగా సమాచారం. మరోవైపు ఎలుగుబంటి మృతదేహానికి వైద్యులు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు.
కాగా.. కిడిసింగి గ్రామానికి చెందిన కలమట కోదండరావును ఆదివారం జీడితోటల వైపు వెళ్తుండగా ఎలుగుబంటి దాడి చేసి చంపింది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున రెండు ఆవులను తొక్కి చంపేసింది. సోమవారం నాడు జీడీ తోటలో పనిచేస్తున్న తామాడ షణ్ముఖరావుపై ఎలుగు దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు యువకులు అప్పలస్వామి, చలపతిరావు, సంతోష్ షణ్ముఖరావును కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ముగ్గురిపై కూడా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ క్రమంలో మాజీ సైనికుడు పోతనపల్లి తులసీరావు, ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న అతని సోదరుడు పురుషోత్తంలు ఎలుగు బంటిని పట్టుకొనే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనం అక్కడికి చేరుకోవడంతో ఎలుగు బంటి తప్పించుకొని పోయింది.
Also REad:శ్రీకాకుళంలో ఎలుగుబంటి ఆపరేషన్ సక్సెస్: భల్లూకాన్ని బంధించిన అధికారులు
మరోవైపు.. సోమవారం నుండి కిడిసింగి గ్రామ సమీపంలోని రేకుల షెడ్ లో ఎలుగుబంటి ఉన్న విషయాన్ని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవాళ ఉదయం నుండి ఎలుగుబంటికి మత్తు ఇచ్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఎలుగుబంటి మత్తులోకి చేరుకున్న తర్వాత బోనులో అధికారులు ఎలుగుబంటి విశాఖ జూకి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఎలుగుబంటి మరణించినట్లుగా తెలుస్తోంది.