ముందస్తు ఎన్నికలనే నేతలు సిద్ధం కావాలి: ఇంచార్జ్లతో చంద్రబాబు
నియోజకవర్గ ఇంచార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలు, వైసీపీ పాలన, బాలయ్య టాక్ షో వంటి అంశాలపై మాట్లాడారు.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇంచార్జీలు, పార్టీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనలతోనే నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టే సన్నద్ధం కావాలని వివరించారు. నియోజకవర్గ ఇంచార్జీలు కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో తాము గెలిచి తీరుతామనే నమ్మకం కలిగించాల్సింది మీరే నని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలూ చేశారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో ప్రతివర్గం నష్టపోయిందని ఆరోపించారు. వారందరిలోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని తెలిపారు. కాబట్టి, ఆ ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీ క్యాష్ చేసుకోవాలని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలని తెలిపారు.
వైసీపీ పార్టీ మూడు రాజధానుల అంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విశాఖను కొల్లగొట్టి.. ఇప్పుడు అక్కడి ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉన్నదా? అని ప్రశ్నించారు.
ఈ విషయమై టీడీపీ నేతలు సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజలకు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం నిలబడాలని ఆయన వివరించారు. మూడు రాజధానులు సాధ్యమయ్యే పని కాదని, ఒక వైపు కోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు.
ఈ సమావేశంలో అన్స్టాపబుల షో గురించీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. బాలకృష్ణ బోల్డ్ శైలీనే అన్స్టాపబుల్ షోను ఇంతటి హిట్ చేశాయని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. అధికార మార్పిడిలో జరిగిన వాస్తవ అవాస్తవల పై చర్చ ఈ షోలో వచ్చిందని తెలిపారు. దశాబ్దాలుగా తమపై బురదజల్లుతున్న లేదా తప్పుగా చిత్రిస్తున్న అనేకం అంశాలపై ఓపెన్గా స్పష్టంగా మాట్లాడామని వివరించారు.