సమగ్ర భూరక్ష చట్టం ప్రజా వ్యతిరేకం:పవన్ కళ్యాణ్తో న్యాయవాదుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సమగ్ర భూరక్ష చట్టంపై న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు.ఇవాళ పవన్ కళ్యాణ్ తో న్యాయవాదులు సమావేశమయ్యారు.తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు.
![Bar Association Delegates Meet with Pawan Kalyan in Andhra Pradesh lns Bar Association Delegates Meet with Pawan Kalyan in Andhra Pradesh lns](https://static-ai.asianetnews.com/images/01hgg0z1qszqd6h8kd3f82wxk7/pawan-kalyan-jpg_363x203xt.jpg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సమగ్ర భూరక్ష చట్టం ప్రజా వ్యతిరేకమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
శుక్రవారం నాడు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై తమకు మద్దతివ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను న్యాయవాదులు శుక్రవారం నాడు కలిశారు. ఏ కారణంతో ఆందోళన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే విషయమై న్యాయవాదులు పవన్ కళ్యాణ్ కు వివరించారు.
ఈ చట్టం సామాన్యుడికి కూడ అర్ధమయ్యేలా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చట్టం తీసుకు వచ్చిన సమయంలో దాని ప్రభావం అంతగా కన్పించదన్నారు. ఆ చట్టం అమలు చేస్తే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తేలుతుందన్నారు. ఈ చట్టం అమలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని న్యాయవాదులు వార్నింగ్ ఇస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
న్యాయపరమైన అవగాహన లేని వారికి కూడ ఈ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు తాను కనీసం రెండు రోజులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రెండు రోజుల పాటు ఈ విషయమై తాను న్యాయవాదులతో చర్చిస్తే ప్రజలకు ఈ చట్టం గురించి మరింత సరళంగా వివరించే అవకాశం ఉంటుందన్నారు.
ఐదుగురు సభ్యులు తనకు ఈ విషయమై లోతుగా వివరించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ చట్టం ప్రజా వ్యతిరేకమైందిగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘనకు గురౌతాయన్నారు
కోర్టుల్ని కాదని రెవిన్యూ అధికారులకు అధికారమిస్తే పవర్ అంతా వాళ్ల చేతుల్లోకి వెళ్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ద్వారా భవిష్యత్తులో రుషికొండను కూడ దోచుకోవచ్చని ఆయన సెటైర్లు వేశారు.కోర్టు అనే రక్షణను తొలగించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తాను కూడ గొంతు కలుపుతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి తాను సంపూర్ణ మద్దతిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.తన శక్తి మేరకు ఈ చట్టం అమలు కాకుండా పోరాటం చేస్తానన్నారు.