కాలేజీకని ఇంట్లోంచి బయటకు వచ్చిన ఇద్దరు బీ ఫార్మసీ విద్యార్థినులు మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నీటమునిగి మృతిచెందారు.
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా సముద్ర తీరానికి గడిపేందుకు వెళ్లిన ఇద్దరు బీ ఫార్మసీ అమ్మాయిలు నీటమునిగి మృతిచెందిన దుర్ఘటన మచిలీపట్నం మంగినపూడి బీచ్ (manginapudi beach) లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలోని విష్ణు కాలేజీలో కాకర ప్రమీల (22), కల్లేపల్లి పూజిత (22) చదువుతున్నారు. బి ఫార్మసీ చదువుతున్న ఈ ఇద్దరూ సరదాగా గడిపేందుకు మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే సముద్ర నీటిలోకి దిగిన ఇద్దరూ అలల తాకిడిలో లోతులోకి కొట్టుకుపోయారు.
అమ్మాయిలిద్దరూ కొట్టుకుపోవడాన్ని గమనించినవారు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గల్లంతయిన అమ్మాయిలను ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే అమ్మాయిలిద్దరూ అనస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఒడ్డుకు చేరిన కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
మైరైన్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో మచిలీపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అమ్మాయిలిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తలరించారు. వారి వివరాలను తెలుసుకుని కుటుంబసభ్యులకు మరణ వార్త తెలిపారు. కాలేజీకని వెళ్ళిన అమ్మాయిలు ఇలా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
