బీఫార్మసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటానని వెళ్లి తిరిగిరాని లోకాలకు.. అనంతపురంలో దుర్ఘటన
బీఫార్మసీ తెచ్చుకుంటానని విజయవాడకు బయల్దేరిన విద్యార్థి మార్గమధ్యలోనే ప్రాణాలు కల్పోయాడు. కదిరి-పులివెందుల మధ్యలోని వంకలో ఆయన వెళ్తున్న కారు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. నలుగురు ప్రయాణిస్తున్న కారులో ఇద్దరు సురక్షితంగా బయటపడగా డ్రైవర్ రఫీ కోసం గాలింపులు జరుగుతున్నాయి.
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరిలో దుర్ఘటన జరిగింది. బీఫార్మసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటానని బయల్దేరిన విద్యార్థి కదిరి-పులివెందుల మధ్యనున్న వంక దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిని ఉన్న ఆ వంతెనపై వేగంగా వెళ్లడంతో కారు అదుపుతప్పి వంకలో కొట్టుకుపోయింది. నలుగురు వెళ్తున్న ఆ కారులో ఇద్దరు సురక్షితంగా బయటపడగా బీఫార్మసీ విద్యార్థి బాబ్జాన్ మృతదేహం లభించగా డ్రైవర్ రఫీ కోసం గాలింపులు చేపడుతున్నారు.
బీఫార్మసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటానని బాబ్జాన్ కదిరి నుంచి విజయవాడకు కారులో బయల్దేరాడు. కానీ, కదిరి పులివెందుల మధ్యనున్న వంక దగ్గర ఉధృతంగా వస్తున్న వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. దీంతో బాబ్జాన్ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కొడుకు అనంతలోకాలకు చేరడంపై కుటుంబం బోరున విలపిస్తున్నది. సర్టిఫికేట్తో తిరిగి వస్తాడనుకున్న తమ బిడ్డ విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరవుతున్నారు.