ఏపీలో రోజు రోజుకు హిందువులపై దాడులు ఎక్కువవుతున్నాయని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు. ఇది సరైంది కాదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు తెలిపారు. గురువారం నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ రాష్ట్ర కార్యకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. స్వామి వారి భక్తుల హృదయం ఎంతగానో గాయపడుతోందని చెప్పారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆరోపించారు. మాటలతోనే ప్రజలను ప్రభుత్వం మభ్య పెడుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రంలో అధికార వైసీపీ ఫాస్టర్స్ కి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తోందని అన్నారు. హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని, అదే అధికార పార్టీ ఎజెండాగా మారిపోయిందని చెప్పారు.
శ్రీశైలంలో రజాక్ బంధువులు రాజ్యం ఏలుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ముస్లింలను రెచ్చగొట్టుడుతున్నారని అన్నారు. యువకులకు ఉద్యోగాలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎలక్ట్రికల్, వైద్య, ఇరిగేషన్, పోలీస్, ఉపాధ్యాయ రంగాల్లో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయడం లేదని విమర్శించారు. పోలీసులకు వారాంతపు సెలవు ఇస్తామని చెప్పారని, కానీ ఆ పోస్టులే భర్తీ చేయడం లేదని తెలిపారు. వైసీపీ అంటే ప్రజా విరోధి ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
యూపీ లాంటి సీఎం ఏపీకి అవసరమని అన్నారు. వరి రైతులకు మిల్లర్లు, దళారులు అన్యాయానికి గురి చేస్తున్నారని అన్నారు. ఎఫ్ సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే వెంటనే నగదు చెల్లించే అవకాశం ఉంటుందని, కానీ ఆ విధానం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని కారణంగా రైతులు ఎంతగానో నష్టపోతున్నారని అన్నారు. ఇందులో వేల కోట్ల రూపాయలు కుంభకోణం తీవ్రంగా ఆరోపించారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తున్నట్టు చెబుతున్నారని, ఇది పూర్తిగా హాస్యాస్పదమని అన్నారు.
ఎమ్మెల్యే తండ్రిని సివిల్ సప్లయ్ చైర్మన్ గా నియమించారని, అందుకే రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఇంధనంపై రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే.. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారి కూడా తగ్గించలేదని అన్నారు. ఈ విషయంలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ డిపో ద్వారా ఇస్తున్న బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. అవినీతిని తొలగించాలంటే బుల్డోజర్లు అవసరం అని తెలిపారు. బీజేపీకి రాజకీయాలు అవసరం లేదని, ప్రజలకు న్యాయం చేయడమే తమకు ముఖ్యమని తెలిపారు.
నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. అయితే చిన్న వృత్తిదారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎంగా వాడుకున్నారని నాడు జగన్ ఆరోపించారని తెలిపారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారని, ఇద్దరూ తోడుదొంగలని తీవ్రంగా ఆరోపించారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను దశాభ్ధాల పాటు పెండింగ్ లోనే ఉంచుతున్నారని అన్నారు. బీజేపీ ఏపీలో ప్రతిపక్ష పాత్రను చక్కగా పోషిస్తోందని తెలిపారు.
