కుప్పం ఆలయంలో విగ్రహాలు ధ్వంసం... సిబిఐ విచారణకు చంద్రబాబు డిమాండ్
కుప్పంలోని శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని... ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
అమరావతి: వైసిపి ప్రభుత్వ ఉదాసీనత వల్లే రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల కుప్పంలో కూడా శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని... ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలపై దాడుల్ని రాజకీయం చేయడం మానేసి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని... వెంటనే సీబీఐ విచారణ కోరి నిందితులను అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అంతర్వేది రధం దగ్దం ఘటన మొదలు రాష్ట్రంలో ఎదో ఒకచోట హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలోని గంగాధనెల్లూరు మండలం అగరమంగళంలోని ఓ దేవాలయంలో నంది విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దాడి చేసి ధ్వంసం చేశారు. గుడిలోంచి విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి మరీ ధ్వంసం చేశారు దుండగులు.
ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు, హిందుత్వ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.